Advertisement

ఈనెల 5న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం..?

మన పత్రిక, సినిమా: టాలీవుడ్‌లో మరో శుభవార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్నారు. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వివాహ వార్తలకు తాజాగా స్పష్టత వచ్చింది. ఈ నెల 5న తిరుమలలో ఆయన నిశ్చితార్థం జరగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిశ్చితార్థం అనంతరం ఈ నెల 29న హైదరాబాద్లో వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలోని వారి ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. హీరో తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే కుటుంబ సభ్యుల మధ్య రోకా కార్యక్రమం సాదాసీదాగా జరిగినట్లు తెలిసింది.

సాయి శ్రీనివాస్‌కు కాబోయే వధువు కావ్య రెడ్డి హైదరాబాద్‌కు చెందిన యువతి. సినీ పరిశ్రమతో సంబంధం లేకపోయినా, ప్రముఖ న్యాయవాది కుటుంబానికి చెందినదిగా సమాచారం. కొంతకాలంగా వీరిద్దరూ పరిచయం పెంచుకుని ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు ఇరువైపుల కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సాయి శ్రీనివాస్ అల్లుడు శీను చిత్రంతో హీరోగా పరిచయమై, జయ జానకి నాయక, రాక్షసుడు వంటి సినిమాలతో గుర్తింపు పొందారు. కమర్షియల్, యాక్షన్, థ్రిల్లర్ చిత్రాల్లో నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ‘హైందవ’, ‘టైసన్ నాయుడు’ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.కెరీర్ పరంగా బిజీ షెడ్యూల్ మధ్య వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించనున్న సాయి శ్రీనివాస్‌కు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాహ వేడుకలకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశముందని సమాచారం.

Advertisement
Advertisement