Advertisement

బాన్సువాడలో వీధికుక్కల దాడి: ఐదేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు

మన పత్రిక, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో వీధికుక్కలు దాడి చేయడంతో ఒక చిన్నారి తీవ్రంగా గాయపడింది. కాలనీకి చెందిన గోతి నానక్ సింగ్ కుమార్తె రిషిత ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు ఒక్కసారిగా ఆమెపై పడ్డాయి. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు వెంటనే వచ్చి కుక్కలను తరిమేసి ఆమెను కాపాడారు.

తీవ్రంగా గాయపడిన చిన్నారిని ముందుగా బాన్సువాడ మాతా-శిశు సంరక్షణ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ ప్రసాద్, పైలట్ సుభాష్ చిన్నారిని సురక్షితంగా నిజామాబాద్ ఆస్పత్రికి చేర్చారు. అత్యవసర వైద్య సేవలు అందిస్తూ త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లిన 108 సిబ్బందికి చిన్నారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సిబ్బంది పేర్కొన్నారు.

Advertisement

ఈ ఘటనతో బాన్సువాడ పట్టణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీధికుక్కల నియంత్రణకు మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement