మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: బ్యాంకు పనుల నిమిత్తం శాఖలకు వెళ్లాలనుకునే వినియోగదారులకు ముఖ్య గమనిక. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. నేడు (జనవరి 24) నెలలో నాలుగో శనివారం కావడంతో నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు సెలవు ఉంటుంది. దీంతో ఈరోజు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. కేవలం ఈ ఒక్కరోజే కాకుండా రాబోయే రెండు రోజులు కూడా బ్యాంకులకు హాలీడే ఉండటంతో కస్టమర్లు తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ వారాంతం బ్యాంకు ఉద్యోగులకు లాంగ్ వీకెండ్గా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారం.. నేడు నాలుగో శనివారం సెలవు కాగా, రేపు జనవరి 25న ఆదివారం సాధారణ వారాంతపు సెలవు ఉంటుంది. ఇక ఎల్లుండి జనవరి 26న సోమవారం గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించారు. దీంతో శని, ఆది, సోమవారాలు కలిపి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో నేతాజీ జయంతి కారణంగా శుక్రవారం నుంచే సెలవులు మొదలయ్యాయి.
బ్యాంకు శాఖలు మూడు రోజుల పాటు మూసి ఉన్నప్పటికీ, వినియోగదారుల ఆర్థిక అవసరాలకు ఆటంకం కలగకుండా డిజిటల్ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అలాగే నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు, నగదు బదిలీల కోసం గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ సేవలు పనిచేస్తాయి. అయితే చెక్కుల క్లియరెన్స్ వంటి పనులకు మాత్రం సోమవారం వరకు అవకాశం ఉండదు. కాబట్టి చెక్కుల ద్వారా లావాదేవీలు జరిపే వారు మంగళవారం వరకు వేచి చూడాల్సి ఉంటుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
