Andhra News : ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల వర్షం కురుస్తోందని మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) శాసన మండలిలో సంచలన ప్రకటన చేశారు. గత 15 నెలల్లోనే రాష్ట్రానికి రూ.10.40 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. పరిశ్రమల విస్తరణతో పాటు ఉద్యోగ సృష్టిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభమైందని లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిందని విమర్శించారు.
విశాఖపట్నంలో ఆర్సెలార్ మిత్తల్ భారీ ఉక్కు కర్మాగారం వచ్చే నవంబరులో ప్రారంభం కానుందని ప్రకటించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం 25 కొత్త పాలసీలను అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే 340 ఎంవోయూలు కుదుర్చుకున్నామని, వాటి ద్వారా రూ.10.4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని వివరించారు.
ఇంకా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. బీపీసీఎల్, ఎన్టీపీసీ, టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి దేశీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు.
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో దక్షిణాసియాలోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ను ఐబీఎం ఏర్పాటు చేస్తోంది. విద్యుత్ రంగంలో రెన్యూ, టాటా పవర్, ప్రీమియర్ ఎనర్జీ వంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. టూరిజం రంగంలో కూడా రాష్ట్రం వేగంగా ఎదుగుతోంది. తాజ్, ఐటీసీ వంటి ప్రముఖ హోటల్ సంస్థలు 6,000 గదులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఐదేళ్లలో 50,000 హోటల్ గదులను అందుబాటులోకి తేవడమే లక్ష్యమని తెలిపారు. కర్నూలులో రిలయన్స్ పెద్ద ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తోంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
