Advertisement

TGSRTC: ఏప్రిల్ 22 నుంచి టీజీఎస్ఆర్టీసీ సమ్మె

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ విలీనం, ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ ఛైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు.

అన్ని ఆర్టీసీ, ప్రజా సంఘాల మద్దతుతో తలపెట్టిన ఈ ఆందోళన మరో ‘సకల జనుల సమ్మె’ను తలపిస్తుందని ఆయన హెచ్చరించారు. మెట్రోను ప్రభుత్వపరం చేసిన పాలకులు, ఆర్టీసీని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో సంస్థ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ పోరాటంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Advertisement

మార్చి 13న 32 డిమాండ్లతో ఇచ్చిన నోటీసుపై ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెంకన్న తెలిపారు. లేనిపక్షంలో సమ్మె తీవ్రతను మరింత పెంచుతామని జేఏసీ తేల్చిచెప్పింది.

Advertisement