Advertisement

హైదరాబాద్‌లో వడగళ్ల వాన.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మన పత్రిక, హైదరాబాద్: నగరంతో పాటు పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి చల్లబడింది. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని పలుచోట్ల వడగళ్లు, మోస్తరు వర్షం కురిసింది. ద్రోణి ప్రభావంతో ఏప్రిల్ 19 నుంచి 22 వరకు రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

బోయిన్‌పల్లి, బాలానగర్‌లో వడగళ్ల వాన పడగా, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్, అల్వాల్‌లో మోస్తరు వర్షం పడింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో ఈదురుగాలులతో తేలికపాటి జల్లులు కురిశాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో నగరవాసులకు ఉపశమనం లభించింది. రాబోయే కొన్ని గంటల్లో జల్లులు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

Advertisement

ఇవాళ వడగళ్ల వర్షాలు పడే సూచనలున్న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలకు అధికారులు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

Advertisement