Advertisement

సోషల్ మీడియా యూజర్లకు కేంద్రం షాక్: ఐటీ రూల్స్ సవరణ

మన పత్రిక వెబ్డెస్క్, న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హద్దులు దాటుతున్న ఫేక్ న్యూస్, విద్వేష ప్రసంగాలు (Hate Speech), వ్యక్తిత్వ హననాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఒకప్పుడు సమాచార విప్లవానికి వేదికైన సామాజిక మాధ్యమాలు ప్రస్తుతం డిజిటల్ అరాచకత్వానికి అడ్డాగా మారుతుండటంతో, అభ్యంతరకర పోస్టులు చేసే యూజర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు నేరుగా నోటీసులు జారీ చేసేలా 2021 ఐటీ నిబంధనలకు ప్రతిపాదిత సవరణల ముసాయిదాను కేంద్రం సోమవారం విడుదల చేసింది.

ఈ కొత్త ఐటీ నిబంధనల ముసాయిదాపై ఏప్రిల్ 14వ తేదీ నాటికి ప్రజలు, సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ప్రభుత్వం అధికారికంగా కోరింది. గతంలో సోషల్ మీడియాలో ఏదైనా ఉల్లంఘన జరిగితే ఎక్స్ (X), మెటా, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు మాత్రమే కేంద్రం నోటీసులు ఇచ్చి సదరు కంటెంట్ తొలగించమని ఆదేశించేది. కానీ, తాజా ప్రతిపాదనల ప్రకారం సోషల్ మీడియాలో వార్తలు, విశ్లేషణలు అందించే ఖాతాలను సైతం ‘డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్’ పరిధిలోకి తీసుకువచ్చి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నేరుగా ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా జవాబుదారీతనం ఫిక్స్ చేయనున్నారు.

Advertisement

సోషల్ మీడియాలో ప్రస్తుతం కనిపిస్తున్న వికృత ధోరణుల వెనుక ప్రధానంగా రాజకీయ పార్టీల ఐటీ సెల్స్ పాత్ర కీలకమని స్పష్టమవుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పెయిడ్ గ్రూపుల ద్వారా చేస్తున్న నెగెటివ్ ప్రాపగాండాకు చెక్ పెట్టడమే తాజా పాలసీ ప్రధాన ఉద్దేశం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకురావాలని భావిస్తున్న హేట్ స్పీచ్ బిల్లు తరహాలోనే, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా ఈ నియంత్రణల వైపు అడుగులు వేస్తోంది. దీనివల్ల విద్వేషాన్ని పెంచి పోషించే రాజకీయ శక్తులకు నష్టం జరిగినా, సామాన్య ప్రజలకు మేలు చేకూరుతుందని, ఆన్‌లైన్ వేదికలు ఆరోగ్యకరమైన చర్చలకు నిలయంగా మారుతాయని భావిస్తున్నారు.

భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కే అయినప్పటికీ దానికి రాజ్యాంగబద్ధమైన లక్ష్మణ రేఖ ఉందని ప్రభుత్వ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద దీనికి సుప్రీంకోర్టు ఎనిమిది పరిమితులను స్పష్టం చేసింది. దేశ సార్వభౌమాధికారం, రాజ్య భద్రత, విదేశాలతో స్నేహసంబంధాలు, ప్రజా శాంతి, సభ్యత లేదా నైతికత, కోర్టు ధిక్కరణ, పరువు నష్టం, మరియు నేర ప్రేరణ వంటి ఎనిమిది అంశాలకు భంగం కలిగించేలా ఉన్న పోస్టులను నియంత్రించే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు.

సోషల్ మీడియాలో పెరిగిపోతున్న అరాచకం సమాజానికి ఒక పెద్ద ముప్పుగా (Threat to Society) పరిణమిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో పెరుగుతున్న డిజిటల్ కాలుష్యాన్ని ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కూడా సొంతంగా హేట్ స్పీచ్ బిల్లులను తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాయి.

Advertisement