మన పత్రిక, హైదరాబాద్: మాంసాహార ప్రియులకు ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. గతవారం వరకు చుక్కలనంటిన చికెన్ ధరలు ఈ వారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కిలో చికెన్పై ఏకంగా రూ. 100 వరకు ధర దిగిరావడం విశేషం.
మార్చి నెల ఆరంభంలో వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో కోళ్లు చనిపోవడం, దాణా ఖర్చులు పెరగడంతో ఫామ్ యజమానులు ధరలు పెంచారు. దానికితోడు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో చికెన్కు డిమాండ్ భారీగా పెరిగింది. ఫలితంగా గత వారం కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 360 నుంచి రూ. 400 దాకా పలికింది. ధరల మంట చూసి చాలామంది వినియోగదారులు సీఫుడ్ వైపు మళ్లారు.
అయితే, వారం తిరిగేలోపే పరిస్థితి మారిపోయి చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ నగరాల్లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర సుమారు రూ. 270 వద్ద కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో కిలో చికెన్ ధర రూ. 300 నుంచి రూ. 350 మధ్యలో పలుకుతోంది. ఉష్ణోగ్రతల్లో మార్పులు, కోళ్ల పెంపకం పరిస్థితులు, మార్కెట్కు వచ్చే సరుకు ఆధారంగా ఈ ధరలు మారుతుంటాయని వ్యాపారులు చెబుతున్నారు. మళ్లీ ధరలు అందుబాటులోకి రావడంతో చికెన్ షాపుల వద్ద కొనుగోలుదారుల సందడి నెలకొంది.
