మన పత్రిక, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 1, 2026 నుంచి ‘కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు-2026’ అమల్లోకి రానున్నాయి. దీంతో ఐటీఆర్ (ITR) ఫైలింగ్ విధానం సమూలంగా మారబోతోంది. ఇప్పటివరకు ఉద్యోగులకు యాజమాన్యాలు ఇచ్చే ‘ఫామ్ 16’ (Form 16) రద్దు కానుంది. దీని స్థానంలో మరింత పకడ్బందీగా ఉండే ‘ఫామ్ 130’ని ప్రవేశపెడుతున్నారు.
కొత్త పన్ను సైకిల్లో ‘ఫామ్ 130’ అత్యంత కీలకం కానుంది. ఇది ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే వార్షిక టీడీఎస్ (TDS) సర్టిఫికెట్గా పనిచేస్తుంది. ఇందులో ఉద్యోగి జీతం, కట్ చేసిన టీడీఎస్, ప్రభుత్వానికి చెల్లించిన పన్ను తదితర పూర్తి వివరాలు ఉంటాయి. ఈ ఫామ్ను యాజమాన్యాలు మాన్యువల్గా జారీ చేయడానికి వీల్లేదు, కేవలం ట్రేసెస్ (TRACES) పోర్టల్ ద్వారా మాత్రమే జనరేట్ చేయాల్సి ఉంటుంది. టీడీఎస్ రిటర్నులు దాఖలై, ప్రాసెస్ అయిన తర్వాతే ఇది అందుబాటులోకి వస్తుంది.
అలాగే, ఆదాయపు పన్ను చట్టం-2025 ప్రకారం ఐటీఆర్ ఫారమ్లలో కూడా పలు మార్పులు చేశారు. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం, మినహాయింపులను మరింత స్పష్టంగా పొందుపరచాలి. ముఖ్యంగా క్యాపిటల్ గెయిన్స్ను (మూలధన లాభాలను) షార్ట్-టర్మ్, లాంగ్-టర్మ్ కేటగిరీలుగా విడిగా చూపించాలి. విదేశీ ఆస్తులు ఉన్నవారు అదనపు వివరాలు వెల్లడించాలి. కొత్త విధానంలో ‘ప్రీ-ఫిల్డ్’ (ముందే నింపిన) డేటాతో ఆటోమేటెడ్ ఫైలింగ్ అందుబాటులోకి రానుంది. దీనివల్ల తప్పులు తగ్గి, వివరాల్లో ఎటువంటి వ్యత్యాసాలు లేకపోతే రీఫండ్లు కూడా మరింత వేగంగా ప్రాసెస్ అవుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
