మన పత్రిక, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పౌరసరఫరాల శాఖ (సివిల్ సప్లై) ఎన్ఫోర్స్మెంట్ బృందం శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.
పట్టణంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్స్లో ఎన్ఫోర్స్మెంట్ బృందం ముమ్మరంగా తనిఖీలు చేసింది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న మంజీర బార్ అండ్ రెస్టారెంట్లో నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ సిలిండర్లను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే ఆ రెస్టారెంట్లో ఉన్న ఆరు గ్యాస్ సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సదరు నిర్వాహకులపై సివిల్ సప్లై చట్టం (యాక్ట్) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో గ్యాస్ నిల్వలపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో అధికారులు ఈ తరహా దాడులను ముమ్మరం చేశారు. గృహ అవసరాలకు ఉద్దేశించిన సిలిండర్లను వ్యాపార సముదాయాలకు మళ్లించడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, అందుకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
