మన పత్రిక, హైదరాబాద్: ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ‘లాక్ డౌన్’ నేడు (మార్చి 11) నిశ్శబ్దంగా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చే థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఆ కోవలోనే థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
ఎ.ఆర్. జీవా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. వాస్తవానికి తమిళంలో తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ సైతం ఈ రోజు నుంచి తమ ఇళ్లల్లోనే ఆస్వాదించే అవకాశం లభించింది.
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం వాస్తవానికి చాలా రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే పలు కారణాలతో సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 30, 2026న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. అయితే, కథా నేపథ్యం కాస్త పాతది కావడం వల్ల అప్పట్లో ఈ చిత్రం థియేట్రికల్గా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
సినిమా కథ విషయానికి వస్తే.. అనుపమ పరమేశ్వరన్ ఇందులో ‘అనిత’ అనే మధ్యతరగతి యువతి పాత్రలో నటించింది. చదువు పూర్తిచేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆమె ఒక రోజు పార్టీకి వెళ్లి, అక్కడ జరిగిన సంఘటన వల్ల అనుకోకుండా గర్భవతి అవుతుంది. ఈ విషయాన్ని తన ఇంట్లో చెప్పలేక, గర్భాన్ని తొలగించుకోవాలని ఆమె నిర్ణయించుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం, ఆసుపత్రులన్నీ పూర్తిగా కోవిడ్ పేషెంట్లతో నిండిపోవడంతో ఆమె ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది.
లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లలేక, తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఇంట్లో దాచలేక అనిత తీవ్రమైన మనోవేదనకు గురవుతుంది. చివరకు ఆమె పరిస్థితి ఏమైంది? ప్రెగ్నెన్సీ విషయం ఇంట్లో తెలిసిందా? ఈ చిత్రంలో ఉన్న మిగతా కథల ప్రాధాన్యం ఏమిటి? తదితర విషయాలు ఈ సర్వైవల్ థ్రిల్లర్లో కీలకంగా మారాయి.
