WhatsApp
Advertisement

నెలాఖరులోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు.. ఏప్రిల్‌లో రెండో విడత: మంత్రి పొంగులేటి!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకంపై రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా (మార్చి 31) రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని, త్వరలోనే గృహప్రవేశాల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

శనివారం సచివాలయంలో ‘ప్రజా పాలన-ప్రగతి నివేదిక’లో భాగంగా.. 99 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా హౌసింగ్ పీడీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

సమీక్షలోని ముఖ్యాంశాలు:

  • రెండో విడత షెడ్యూల్: ఏప్రిల్ నెలలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కానుంది. అప్పటిలోగా మొదటి దశ ఇళ్ల పనులన్నీ ఓ కొలిక్కి రావాలని అధికారులను ఆదేశించారు.
  • యుద్ధప్రాతిపదికన గ్రౌండింగ్: రాష్ట్రంలో ఇప్పటికే 3.60 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, కేవలం 20 శాతం ఇళ్లకే గ్రౌండింగ్ పనులు పూర్తయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో మార్చి 31లోపు మిగతా ఇళ్ల గ్రౌండింగ్ కూడా పూర్తి చేయాలి.
  • పెండింగ్ బిల్లుల చెల్లింపు: వివిధ కారణాలతో మధ్యలో ఆగిపోయిన ఇళ్లకు తక్షణమే మిగతా బిల్లులు చెల్లించాలి. నిర్మాణానికి దగ్గరగా ఉన్న ఇళ్లను జూన్ చివరి నాటికి పూర్తి చేయాలి. ఇసుక, సిమెంట్ ధరల భారం పడకుండా ‘ధరల నియంత్రణ కమిటీలు’ చురుగ్గా పనిచేయాలి.
  • డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు: ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను సైతం మార్చి 31లోపు పూర్తి చేయాలి. ఇందులో సొంత స్థలం లేని నిరుపేదలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
  • పెండింగ్ రిజిస్ట్రేషన్లు: హౌసింగ్ బోర్డు పరిధిలో పెండింగ్‌లో ఉన్న 5 వేల రిజిస్ట్రేషన్లను వెంటనే పూర్తి చేయనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి నూతన ‘హౌసింగ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌’ను ప్రారంభించడంతో పాటు 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Advertisement