తెలుగు రచయితలలో ఎంతో పేరున్న నవలా రచయిత “యండమూరి వీరేంద్రనాథ్”(Yandamoori Veerendranath). “తులసిదళం” (Tulasidalam) నవలతో ఫేమస్ అయిన యండమూరి వీరేంద్రనాథ్ చలన చిత్ర రంగంలోనూ రాణించారు. ఆయన రచించిన పలు నవలలను సినిమాలుగా తెరకెక్కించారు డైరెక్టర్లు. ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ఓ నవలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిరంజీవి (Chiranjeevi) “అభిలాష”, ఛాలెంజ్, రాక్షసుడు వంటి చిత్రాలు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ప్రజాదరణ తెచ్చుకున్నాయి. అంతే కాదు యువతకు సందేశాలిస్తూ పలు వ్యక్తిత్వ వికాస నవలలు కూడా రాసారు. అయితే కొత్త రచయితలు వస్తూ ఉన్న కొద్దీ యండమూరి హవా తగ్గింది.
ఇదిలా ఉండగా యండమూరి వీరేంద్రనాథ్ వయసు మీద పడుతున్న కొద్దీ కొన్ని సార్లు ఆయన చేసే పనుల వల్ల ప్రజల దృష్టిలో చులకన అయిపోతున్నారు. తెలిసి చేస్తున్నారో, తేలిక చేస్తున్నారో తెలీదు గాని… ఆ చెప్పే కొన్ని మాటల వల్ల జనాల దృష్టిలో చాలా బ్యాడ్ అయిపోతున్నారు. ఆ మధ్య ఓ పదేళ్ల కిందట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) కి పెద్దగా నటన రాదు.. అంటూ అన్న వ్యాఖ్యలు కొన్నాళ్ల పాటు ఆయన్ని వెంటాడాయి. యండమూరి రామ్ చరణ్ ఫ్యాన్స్ ని క్షమాపణ చెప్పేదాకా ఈ వివాదం వెంటాడింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ వివాదాస్పదమయ్యారు యండమూరి వీరేంద్రనాథ్.
తాజాగా విజయవాడ లో భవానిపురం పర్యాటక ప్రాంతంలో “ఆవకాయ అమరావతి” పేరుతో టూరిజం శాఖ 3 రోజుల పాటు ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా వ్యక్తిత్వ వికాసం మీద ఎన్నో పుస్తకాలు రచించిన “యండమూరి” గెస్ట్ గా పిలిచి ఆయన చేత ప్రసంగం చేయించారు. అయితే ప్రసంగం అంతా పూర్తి చేసాక, తన ఉపన్యాసానికి చప్పట్లు రాకపోవడంతో ఒకింత అసహనానికి గురయిన యండమూరి వెంటనే ఆ సభాముఖంగానే “చప్పట్లు కొట్టలేని కుటుంబాలు నాశనం అయిపొవాలని సరస్వతిదేవి శపిస్తుంది” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
అయితే ఇదే విషయంపై అక్కడే ఓ మహిళా ధైర్యంగా యండమూరిని ప్రశ్నించింది. కానీ ఆయన ఏం సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. అయితే మోస్ట్ సీనియర్ సిటిజన్, ఫేమస్ నవలా రచయిత అయిన యండమూరి అక్కడున్న ప్రేక్షకులని, సభకు వచ్చిన వారిని ఈ రకంగా అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ వస్తున్నాయి. జనాలు చప్పట్లు కొట్టాలనిపిస్తే కొడతారు, లేకపోతే లేదు.. కాదంటే ఆయన జనాలని అంత ఇంప్రెస్ చేయలేదని అర్ధం. ఇంత వయసు అనుభవం ఉన్న యండమూరి ఇలా విచక్షణ జ్ఞానం కోల్పోయి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శకులు అంటున్నారు.
