Advertisement

Hyderabad: మియాపూర్‌లో 5 అంతస్తుల భవనం కూల్చివేత.. హైడ్రా చర్యలు!

మన పత్రిక, వెబ్​డెస్క్: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, నకిలీ రికార్డులతో నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, మియాపూర్‌లోని సర్వే నంబర్ 100లో భారీగా అక్రమ నిర్మాణాలు జరిగినట్లు విచారణలో గుర్తించారు. ఆక్రమణదారులు ఏకంగా హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన కంచెను తొలగించి, సర్వే నంబర్ 100లోనే 307, 308 పేర్లతో దొంగ రికార్డులు సృష్టించారు.

ఈ నకిలీ పత్రాలను అడ్డుపెట్టుకుని ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణంపై స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలంలో జరిగిన అక్రమ నిర్మాణంగా తేలడంతో, శనివారం ఉదయం భవనాన్ని కూల్చివేశారు.

Advertisement

ఈ కూల్చివేతలతో పాటు, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పీజేఆర్ కాలనీ, చందానగర్-అమీన్‌పూర్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా హైడ్రా శనివారం ఉదయం నుంచి అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టింది. కాగా, శుక్రవారం నాడు పోచారంలో సుమారు రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కూడా హైడ్రా అధికారులు ఆక్రమణల నుంచి కాపాడినట్లు తెలిసింది.

Advertisement