Advertisement

సీఎం చంద్రబాబు పర్యటన: కలెక్టర్ పరిశీలన

మన పత్రిక, విజయనగరం: అక్టోబర్ 1న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, దత్తిరాజేరు మండలంలోని దత్తి గ్రామంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. తాజా సమాచారం ప్రకారం, ముందుగా హెలిపాడ్ స్థలం, మ్యాప్‌లను పరిశీలించి, జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్‌తో సహా ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా, గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన చెత్తను తొలగించాలని, కాలువలను శుభ్రం చేయాలని, రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని, ప్రక్కన ఉన్న గోతులను పూడ్చివేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి బహిరంగ సభలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేయనున్న నేపథ్యంలో, లబ్ధిదారుల పేర్లను కలెక్టర్ స్వయంగా సమీక్షించి ఖరారు చేశారు.

Advertisement

సభ నిర్వహించే ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. స్టేజి ఏర్పాట్లపై చర్చించి, వర్షాలు పడినా ఇబ్బంది కలగకుండా నీటి పారుదల, నీడ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీఐపీ లాంజ్‌ను పరిశీలించి, సౌకర్యాలు పరిశీలించారు. వాహనాల పార్కింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సమీపంలోని జెడ్పీ పాఠశాలలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, ఆర్&బీ ఎస్ఈ కాంతిమతి, పిఆర్ ఎస్ఈ శ్రీనివాసరావు, డీఆర్డీయే ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, డీపీఓ మల్లికార్జునరావు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విమలారాణి, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ప్రమీలా గాంధీ, ఆర్డీవో రామ్మోహన్, తహసీల్దార్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement