Advertisement

TG Highcourt: రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం

మన పత్రిక, వెబ్​డెస్క్

వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన వి. కవిత ఇంటిని 2004లో ప్రభుత్వం సేకరించింది. ఆమెకు నిర్వాసితుల జాబితాలో చేర్చకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఆమెను జాబితాలో చేర్చాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను అమలు చేయకుండా పోవడంతో కవిత కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

అదే సమయంలో ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులపై అప్పీలు దాఖలు చేసింది. అయినప్పటికీ పెండింగ్‌లో ఉన్న ఉత్తర్వులకు విరుద్ధంగా కలెక్టర్, ఆర్డీవోలు 2024 అక్టోబర్‌లో తహసీల్దార్‌కు లేఖ రాశారు. “కోర్టును తప్పుదోవ పట్టించింది” అని పేర్కొని కవితపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై కవిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ తీర్పు వెలువరించారు. “కలెక్టర్ తీరు సరికాదు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా చర్యలు తీసుకునే అధికారం ఆయనకు లేదు” అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్‌ను తీవ్రంగా మందలించాలని హైకోర్టు ఆదేశించింది.

అడ్వొకేట్ జనరల్ హాజరై కేసు ఉపసంహరణకు సమ్మతించారు. కవితను నిర్వాసితుల జాబితాలో చేర్చి అన్ని ప్రయోజనాలు అందించాలని కోర్టు స్పష్టం చేసింది.

Advertisement