Advertisement

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి నటి నక్షత్ర మలయాళ థ్రిల్లర్ ‘ఐ నో నోబడీ’

మన పత్రిక: ‘ఇరుముడి’ సినిమాలో కథానాయకుడి కుమార్తె పాత్రలో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ నటి నక్షత్ర నటించిన మలయాళ చిత్రం ‘ఐ నో నోబడీ’ డిజిటల్ వేదికపైకి వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ చిత్రం గత నెలలో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

₹17 కోట్ల దొంగతనం నేపథ్యంతో కథ

ఈ చిత్ర కథ రూ. 17 కోట్ల బ్యాంక్ దొంగతనం చుట్టూ తిరుగుతుంది. సచివాలయంలో సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసే రాజీవన్ (పృథ్వీరాజ్ సుకుమారన్), ఆయన భార్య మీరా (పార్వతి), ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తుంటాడు. ఆయన ఉన్న ప్రాంతంలోని బ్యాంకులో దోపిడీ జరిగిన సమయంలో రాజీవన్ అక్కడే ఉంటాడు. పారిపోయే క్రమంలో దొంగలు ఆయనపై దాడి చేసి తమ వాహనంలో తీసుకెళ్తారు.

Advertisement

ఆ వాహనం ప్రమాదానికి గురవ్వడంతో దొంగలు అక్కడికక్కడే మరణించగా రాజీవన్ ప్రాణాలతో బయటపడతాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, దొంగిలించిన రూ. 17 కోట్లు మాయమవ్వడం పెద్ద చిక్కుముడిగా మారుతుంది. ఆ డబ్బు ఏమైంది, ఈ దొంగతనంతో రాజీవన్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. ఈ చిత్రంలో నక్షత్ర పరిమిత సమయమే కనిపించినప్పటికీ ఆమె పాత్ర ప్రత్యేక ముద్ర వేసింది.

Advertisement