Advertisement

డిపాజిట్ వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిబంధనలు

మన పత్రిక: బ్యాంకుల్లో డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పారదర్శకతను పెంచడంతో పాటు వినియోగదారులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ నిబంధనలను తీసుకొచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఇవి 2026 అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. వాణిజ్య బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, స్థానిక ప్రాంత బ్యాంకులు మరియు పట్టణ సహకార బ్యాంకులకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి.

రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లను బల్క్ డిపాజిట్లుగా పరిగణిస్తారు. ఇప్పటివరకు ఇలాంటి పెద్ద డిపాజిట్లపై బ్యాంకులు తమ ప్రాధాన్యతను బట్టి వేర్వేరు ఖాతాదారులకు వేర్వేరు వడ్డీ రేట్లను ఇచ్చేందుకు అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం ఈ విధానానికి స్వస్తి పలకనున్నారు.

Advertisement

కొత్త నిబంధనల ప్రధాన అంశాలు

అక్టోబర్ 1 నుంచి ప్రతి వాణిజ్య బ్యాంకు రోజువారీ బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ఉదయం 10:00 గంటలకు తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. గరిష్టంగా ఉదయం 10:10 గంటల లోపు ఈ వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. వెబ్‌సైట్‌లో పేర్కొన్న రేటుకు మాత్రమే డిపాజిట్లను స్వీకరించాలి తప్ప, అంతకంటే ఎక్కువ లేదా తక్కువ వడ్డీని వ్యక్తిగతంగా ఇచ్చేందుకు వీలుండదు.

ఒకే రోజున ఒకే మొత్తాన్ని డిపాజిట్ చేసే ఏ ఇద్దరు ఖాతాదారుల మధ్య వడ్డీ రేట్లలో వ్యత్యాసం ఉండకూడదు. అన్ని శాఖల్లోనూ అందరు వినియోగదారులకు ఒకే రకమైన వడ్డీ రేటును అమలు చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దీనివల్ల పెద్ద సంస్థలు, వ్యాపారులు మరియు హెచ్‌ఎన్‌ఐలకు పారదర్శకమైన సమాచారం అందుబాటులో ఉంటుంది.

లిక్విడిటీ రిస్క్ ఆధారంగా వడ్డీ పెంపునకు అవకాశం

బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత రిస్క్ ఆధారంగా డిపాజిట్ ధరను నిర్ణయించేందుకు ఆర్‌బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR) నిబంధనల ప్రకారం, ఉపసంహరణ ముప్పు ఎక్కువగా ఉన్న డిపాజిట్లను ఆకట్టుకునేందుకు బ్యాంకులు కొంత ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేయవచ్చు. ఈ సదుపాయం దేశీయ బల్క్ డిపాజిట్లతో పాటు ఎన్‌ఆర్‌ఐ బల్క్ డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది.

సాధారణ రీటైల్ డిపాజిటర్లకు (రూ.3 కోట్ల కంటే తక్కువ చేసేవారికి) నేరుగా ఈ నిబంధనలలో మార్పులు లేకపోయినప్పటికీ, ప్రచురించిన రేట్ల ప్రకారమే వడ్డీ చెల్లించాలనే సూత్రం అందరికీ వర్తిస్తుంది. అక్టోబర్ 1 తర్వాత ఏ బ్యాంకు అయినా వెబ్‌సైట్‌లో ప్రచురించిన దానికంటే భిన్నమైన వడ్డీ రేటును ఆఫర్ చేస్తే, అది ఆర్‌బీఐ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement