Advertisement

ఫార్ములా-ఈ రేసు కేసులో నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్

మన పత్రిక, హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జులై 31న నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న ఆయనకు రూ. లక్ష పూచీకత్తుతో పాటు ఇద్దరి షూరిటీ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. కేటీఆర్‌తో పాటు ఇతర నిందితులు అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి కూడా కోర్టులో పూచీకత్తు అందించారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసింది.

ఏసీబీ మోపిన అభియోగాలు

యూకేకు చెందిన ఫార్ములా-ఈ ఆర్గనైజేషన్‌కు నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారనే ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు నిర్వహించి మార్చి 23న 77 పేజీల ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. ఇందులో 14 మంది సాక్షులను పేర్కొంటూ కేటీఆర్‌తో సహా ఐదుగురిపై అభియోగాలు మోపింది. క్యాబినెట్, ఆర్థిక, న్యాయ శాఖల అనుమతులు లేకుండా నిర్ణయాలు తీసుకుని, ఎన్నికల కోడ్ మరియు నిబంధనలను ఉల్లంఘించి హెచ్ఎండీఏ ద్వారా సుమారు రూ. 75.88 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారని ఏసీబీ పేర్కొంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లి ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూరిందని, రాబోయే సీజన్లకు సంబంధించి ప్రభుత్వంపై రూ. 600 కోట్ల భారం పడేలా ఒప్పందాలు చేశారని ఛార్జ్‌షీట్‌లో ఆరోపించింది.

Advertisement

అక్రమ కేసులంటూ కేటీఆర్ స్పందన

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి వేదికగా నిలపాలనే ఉద్దేశంతో నాటి ప్రభుత్వం సమిష్టిగా తీసుకున్న విధానపరమైన నిర్ణయమని కేటీఆర్ వాదించారు. అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను నేరాలుగా చిత్రీకరిస్తూ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసులు బనాయించారని ఆరోపించారు. కుట్రపూరితంగా బనాయించిన ఈ తప్పుడు కేసులు ప్రజల తరఫున చేసే పోరాటాన్ని ఆపలేవని, అంతిమంగా సత్యమే గెలుస్తుందని విచారణకు ముందు ఆయన సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. కోర్టు ప్రక్రియ పూర్తయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేటీఆర్ నర్సంపేటకు వెళ్లారు.

Advertisement