మన పత్రిక, హైదరాబాద్: ప్రైవేటు కంపెనీల్లో పనిప్రాంతానికి సంబంధించిన ఫిర్యాదులను విచారించే అధికార పరిధి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC)కు లేదని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే కమిషన్ విచారణ చేపట్టగలదని ధర్మాసనం పేర్కొంది. అమెరికాకు చెందిన బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ ‘వెల్స్ ఫార్గో ఇంటర్నేషనల్ సొల్యూషన్స్’పై కమిషన్ చేపట్టిన ప్రొసీడింగ్స్ను రద్దు చేస్తూ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
తనపై మానసిక వేధింపులు జరిగాయంటూ ఒక మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మానవ హక్కుల కమిషన్ విచారణ ప్రారంభించగా, దాని పరిధిని సవాలు చేస్తూ వెల్స్ ఫార్గో సంస్థ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లను పరిష్కరించిన న్యాయస్థానం, సదరు బాధితురాలు చట్టప్రకారం అందుబాటులో ఉన్న ఇతర న్యాయ వేదికలను ఆశ్రయించవచ్చని తెలిపింది.
కేసు వివరాలు
సదరు మహిళ 2011లో అసిస్టెంట్ ఫైనాన్షియల్ అనలిస్ట్గా కంపెనీలో చేరి, 2019 నాటికి సీనియర్ కమర్షియల్ లోన్ సర్వీసింగ్ ప్రతినిధిగా పదోన్నతి పొందారు. ఆ సమయంలో ఒక ఉన్నతాధికారి నుంచి వేధింపులు ఎదురయ్యాయని, పనితీరు మూల్యాంకనంలో మోసం జరిగిందని ఆమె ఆరోపించారు. మానసిక క్షోభ వల్ల తనకు గర్భస్రావం కూడా జరిగిందని ఆమె పేర్కొన్నారు. 2019 జూలైలో ఇద్దరు సహద్యోగులపై హెచ్ఆర్కు ఫిర్యాదు చేయగా, అదే ఏడాది డిసెంబర్లో సంస్థ విచారణను ముగించింది. దీంతో ఆమె రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు.
కమిషన్ విచారణను కంపెనీ హైకోర్టులో సవాలు చేయగా, కమిషన్ మరియు ఉద్యోగి తరఫున వాదనలు వినిపించారు. అయితే, ఆ వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు, కమిషన్ తన చట్టబద్ధమైన అధికార పరిధిని దాటి ప్రైవేటు సంస్థపై చర్యలు తీసుకుందని స్పష్టం చేసింది. చట్టంలో పేర్కొన్న పరిమితులను దాటి కమిషన్ తన అధికారాలను విస్తరించుకోలేదని తీర్పులో వెల్లడించింది.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
