Advertisement

తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ జారీ ప్రారంభం

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ విధానంలో ఫ్యామిలీ రిజిస్టర్‌ను రూపొందించి, మీసేవ వేదిక ద్వారా ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్’ (FRC) జారీ ప్రక్రియను ప్రారంభించింది. పౌరులు తమ కుటుంబ వివరాలను ధ్రువీకరించుకోవడానికి మరియు వివిధ ప్రభుత్వ సేవలను సులభంగా పొందేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ జూలై 25, 2026 నాటి జీవో 172 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ధ్రువీకరణ పత్రంలో కుటుంబ యజమాని పేరుతో పాటు సభ్యులందరి వివరాలు, వారి వయస్సు, పుట్టిన తేదీ, ఆధార్ సంఖ్య మరియు ప్రస్తుత చిరునామా ఉంటాయి. పౌరసరఫరాల శాఖ పరిధిలోని రేషన్ కార్డు డేటాబేస్ ఆధారంగా ఈ రిజిస్టర్ పనిచేస్తుంది. సంబంధిత మండల తహసీల్దార్ ఈ సర్టిఫికేట్‌ను జారీ చేసే అధికారిగా వ్యవహరిస్తారు. కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడైనా కేవలం రేషన్ కార్డు నంబరును సమర్పించి, ఎటువంటి అదనపు పత్రాలు లేకుండా మీసేవ కేంద్రం లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా 62 రూపాయల సేవా రుసుము చెల్లించి దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన రెండు పనిదినాల్లోగా తహసీల్దార్లు దీనిని పరిష్కరించాల్సి ఉంటుంది.

Advertisement

ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో పుట్టిన తేదీని నిరూపించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించిన 12 పత్రాలలో ఈ ఫ్యామిలీ రిజిస్టర్ కూడా ఒకటిగా ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఈ సర్టిఫికేట్ కేవలం కుటుంబ సభ్యుల వివరాల నమోదుకు మాత్రమే పరిమితమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని ద్వారా ఆస్తి హక్కులు సంక్రమించవని, వారసత్వ ధ్రువీకరణ పత్రంగా గానీ లేదా కేవలం దీని ఆధారంగానే సంక్షేమ పథకాలకు అర్హత గానీ లభించదని స్పష్టం చేసింది.

ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఈ నిర్ణయాన్ని స్వాగతించగా, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ కూడా దీనిని సమర్థించారు. అయితే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ఈ సర్టిఫికేట్లను త్వరత్వరగా జారీ చేస్తోందని ఆరోపించారు.

Advertisement