Advertisement

సైబర్ బాధితులకు రూ. 9.78 కోట్లు రీఫండ్ చేసిన టీజీసీఎస్బీ

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ Cyber Security Bureau (TGCSB) రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాల బాధితులకు ఊరట కలిగిస్తూ, 24,268 కేసుల్లో దాదాపు రూ. 9.78 కోట్ల రీఫండ్ ఉత్తర్వులను పూర్తి చేసింది. మనీ రీస్టోరేషన్ మోడ్యూల్ (MRM) ద్వారా బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని TGCSB డైరెక్టర్ షికా గోయల్ వెల్లడించారు. జాతీయ స్థాయిలో వినియోగిస్తున్న సమన్వయ్, సహయోగ్, గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజమ్ వంటి వేదికల పనితీరులోనూ తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు.

జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా పనిచేసే మనీ రీస్టోరేషన్ మోడ్యూల్ విధానం ఈ ఏడాది జూన్‌లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి నోటిఫికేషన్ వచ్చిన బాధితులు, ఫిర్యాదుతో లింక్ అయిన మొబైల్ నంబర్ ద్వారా సైట్‌లో లాగిన్ అయి ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు, పోలీసులు ఈ దరఖాస్తులను పరిశీలించిన తర్వాత రీఫండ్ మొత్తాన్ని నేరుగా బాధితుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ప్రక్రియ ఉచితమని, రీఫండ్ పేరుతో ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు అడిగే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Advertisement

రాష్ట్రంలో ఇ-జీరో ఎఫ్‌ఐఆర్ వ్యవస్థ కూడా అందుబాటులోకి వచ్చిందని షికా గోయల్ పేర్కొన్నారు. దీనివల్ల బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, నిర్దేశిత పరిమితికి మించి ఆర్థిక నష్టం జరిగిన కేసుల్లో టీజీసీఎస్బీ స్వయంచాలకంగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తుంది. అంతకుముందు లోక్ అదాలత్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 59,953 మంది సైబర్ బాధితులకు రూ. 445.41 కోట్లు తిరిగి అందించగా, ఈ ఏడాది జనవరి నుంచి జూలై మధ్య కేవలం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఎంఆర్‌ఎం పోర్టల్ ద్వారా రూ. 25 కోట్లకు పైగా సొమ్మును బాధితులకు పునరుద్ధరించారు.

Advertisement