Advertisement

బెల్లంపల్లి గురుకులంలో విషాహారం ఘటనపై స్పందించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్

మన పత్రిక: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బిసి బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి భోజనం తిన్న తర్వాత విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) తీవ్రంగా స్పందించింది. ఈ విషాహారం ఘటనను కమిషన్ స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించింది. జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని మానవ హక్కుల కమిషన్, ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

పాఠశాలలో ఘటనకు దారితీసిన పరిస్థితులు, విద్యార్థినులకు అందించిన వైద్య సహాయం, అధికారిక విచారణలో తేలిన విషయాలు మరియు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకున్న నివారణ చర్యలపై నివేదిక ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. ఈ వివరాల సమర్పణ కోసం తదుపరి విచారణను ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

జూలై 22న బెల్లంపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో రాత్రి భోజనం చేసిన తర్వాత దాదాపు 30 మంది విద్యార్థినులు కడుపునొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు. అస్వస్థతకు గురైన వారిని వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం చాలామంది విద్యార్థినులు అర్ధరాత్రి సమయానికి డిశ్చార్జి అయ్యారు. అయితే డిశ్చార్జి అయిన వారిలో సుమారు ఎనిమిది మంది విద్యార్థినులకు గురువారం ఉదయం మళ్లీ అవే లక్షణాలు కనిపించడంతో వారిని తిరిగి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. విద్యార్థినుల అస్వస్థతకు అసలు కారణాలను తెలుసుకోవడానికి అధికారులు పాఠశాల నుంచి ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌ విశ్లేషణకు పంపించారు.

Advertisement