Advertisement

మెదక్ జిల్లాలో అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం

మన పత్రిక, టేక్మాల్: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం పోగులంపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భిణికి 108 అత్యవసర వైద్య సేవల సిబ్బంది అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం చేశారు. గురువారం గర్భిణికి పురిటినొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ భానుప్రియ, పైలట్ కిరణ్ ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే నొప్పులు మరింత ఎక్కువయ్యాయి.

సమయస్ఫూర్తితో ప్రాణ రక్షణ

ఆసుపత్రికి వెళ్లే సమయం లేదని గుర్తించిన సిబ్బంది, వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు. కాల్ సెంటర్ వైద్యులు డాక్టర్ మనీష్ ఫోన్ ద్వారా అందించిన సూచనలను పాటిస్తూ, ఈఎమ్‌టి భానుప్రియ అంబులెన్స్‌లోనే సాధారణ ప్రసవం చేశారు. ప్రసవం తర్వాత తల్లి, బిడ్డను టేక్మాల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధృవీకరించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బందిని స్థానికులు, అధికారులు అభినందించారు.

Advertisement
Advertisement