Advertisement

పార్లమెంటులో ప్రజా సమస్యలపై గళమెత్తండి: వైఎస్ జగన్

మన పత్రిక, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలన పూర్తిగా కుప్పకూలిందని, పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యలను, అవినీతిని, అక్రమ కేసులను మరియు రైతులు, ఉద్యోగుల సమస్యలను బలంగా లేవనెత్తాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలను ఆదేశించారు. జూలై 20న ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీలు మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు, లోక్‌సభ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు ఎంపీలు ఎం.గురుమూర్తి, వై.ఎస్.అవినాష్ రెడ్డి, గొమ్మ తనూజ రాణి పాల్గొన్నారు. మాజీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్టీ కట్టుబడి ఉందని జగన్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Advertisement

ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై నిరసన

DSC 2025లో భారీ అక్రమాలు జరిగాయని, పరీక్ష రాయకుండానే నియామకాలు చేపట్టడం, క్వశ్చన్ పేపర్ లీకేజీలు, స్పోర్ట్స్ కోటాలో అవినీతి చోటుచేసుకున్నాయని జగన్ ఆరోపించారు. అమరావతి నిర్మాణంలో చదరపు అడుగుకు రూ. 20 వేల కంటే ఎక్కువ ఖర్చు చేయడం, రామాయపట్నం పోర్టును తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వంటివి పెద్ద స్కామ్‌లని ఆయన విమర్శించారు. ఇసుక, మద్యం, మైనింగ్ రంగాల్లో మాఫియా రాజ్యమేలుతోందని, ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రూ. 3.6 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆయన ధ్వజమెత్తారు.

రైతులు, ఉద్యోగుల సమస్యల ప్రస్తావన

ఉపాధ్యాయులపై టెట్ (TET) నిబంధనను బలవంతంగా రుద్దడం అన్యాయమని, దీనిపై కేంద్ర మంత్రిని కలిసి విన్నవించాలని ఎంపీలకు సూచించారు. అక్వా రైతులు సిండికేట్ల వల్ల నష్టపోతున్నారని, సాధారణ రైతులకు గిట్టుబాటు ధరలు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ (PRC), ఐఆర్, పెండింగ్ డీఏలు వంటి సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, సోషల్ మీడియా పేరుతో ప్రజలను అరెస్టు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరును పార్లమెంటులో ఎండగట్టాలని ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

Advertisement