Advertisement

సింగరేణిని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దోచుకున్నాయి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మన పత్రిక: సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి ఆర్థికంగా దెబ్బతీశాయని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం, కాంగ్రెస్ పాలకులు సింగరేణిని సొంత ఖజానాలా వాడుకున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కార్మికుల కష్టార్జితంతో నడిచే ఈ సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టి, భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు.

గత కేసీఆర్ ప్రభుత్వం సింగరేణికి రూ. 30 వేల కోట్ల బకాయిలు ఉంచగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ. 24 వేల కోట్లు కలిపి మొత్తం రూ. 54 వేల కోట్ల భారం మోపిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో సింగరేణి బోర్డును ఉత్సవ విగ్రహంగా మార్చి, టెండర్ల పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. సంస్థ ఆదాయాన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లు వంటి అనవసరమైన అంశాలకు మళ్లించారని ఆయన విమర్శించారు.

Advertisement

రాజకీయాల కంటే సింగరేణిని కాపాడుకోవడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయించి కార్మికులకు భరోసా కల్పించామని ఆయన గుర్తుచేశారు. సంస్థ మనుగడ కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా కేంద్రం అండగా నిలుస్తుందని, కార్మికుల ప్రయోజనాలను కాపాడతామని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement